Sunday, December 20, 2015

వీఆర్‌ఏల సమ్మెకు 50రోజులు!


  కేవలం రెండు డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆదివారం నాటికి 50 రోజులు గడిచాయి. విధులకు హజరుకాకుండా, వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు తమగోడు చెప్పుకొని వినతులు అందించినా పట్టించుకోలేదు. దీంతో డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె ఆపేది లేదని సంఘ ప్రతినిధులు స్పష్టంచేస్తున్నారు.

సమ్మె కారణంగా తహశీల్దార్ కార్యాలయాల్లో పనులు ఆగిపోతున్నాయి. 2012-14 మధ్య కాలంలో ఏపీపీఎస్సీ నేరుగా గ్రామ రెవెన్యూ సహయకులను నియమించేందుకు రెండు దశల్లో పోటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారిని వీఆర్‌ఏలుగా నియమించారు. ఇందులో ప్రస్తుత ఏపీలో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన 4,728 మంది వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నారు. వీరు నియమితులైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ సమ్మెలోకి వెళ్లలేదు. ప్రస్తుతం వీరంతా ప్రధానంగా రెండు డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు.

కార్యాలయాల్లో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో చివరిస్థానంలో ఉన్నారు. వీరికి అమలవుతున్న పేస్కేలునే తమకు వర్తింపచేయాలన్నది ప్రధాన డిమాండ్.  వీఆర్‌ఏలకు ప్రమోషన్ల శాతం 30 నుంచి 70శాతానికి పెంచాలన్నాది మరో డిమాండ్. ఈ రెండు డిమాండ్లను సాధించుకునేందుకు వీఆర్‌ఏలు నవంబర్ 2న సమ్మె బాట పట్టారు. అప్పటినుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీరి సమ్మెకు ఆదివారానికి 50రోజులు ముగిశాయి.

No comments:

Post a Comment