Thursday, December 24, 2015

క్యాట్ ఫినిష్

 కొల్లేరు కేంద్రంగా నిషిద్ధ క్యాట్‌ఫిష్ మాఫియా చెలరేగిపోతోంది. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో యథేచ్ఛగా సాగు చేసేస్తున్నారు. ఈ చేపల్ని తింటే ఒళ్లు గుల్లవడం ఖాయమని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం క్యాట్‌ఫిష్ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతోంది. కొల్లేరు  అభయారణ్యంలో మడుగులు ఏర్పాటుచేసి మరీ ఈ సాగు చేపట్టారు. వీటికి కోళ్ల వ్యర్థాలు, మిగిలిపోయిన అన్నం, కూరలను  మేతగా  వేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలా వ్యర్థాల రవాణా ద్వారా ప్రతి నెలా రూ.150 కోట్ల టర్నోవర్ సాగిస్తున్నారు. సాక్షాత్తూ వైద్య,  ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇలాకాలోనే ఇంత దారుణం జరుగుతున్నా ఆయన పట్టించుకోకపోవడం గమనార్హం.

  కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన క్యాట్‌ఫిష్ సాగు అధికార పార్టీ నేతల అండతో జోరుగా జరుగుతోంది. టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు ఈ దందాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లా హద్దుల్లోని కొల్లేరు ప్రాంతం నుంచి రోజూ 10 టన్నుల క్యాట్‌ఫిష్‌ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక్కడ కేజీ రూ.30కి కొనుగోలు చేసి అక్కడి మార్కెట్‌లో రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఏటి చేపలుగా చెప్పి వీటిని ఇతర రాష్ట్రాల్లోని మత్స్యప్రియులకు అంటగడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2007లో క్యాట్‌ఫిష్ పెంపకంపై నిషేధం విధించింది. ఆఫ్రికాకు చెందిన ఈ చేప కోడిఈకలు, పేగులు వంటి వ్యర్థాలను మేతగా తింటుంది. ఇవికాక నిల్వఉన్న అన్నం, కూరల్ని కూడా ఆహారంగా తీసుకుంటుంది. వీటన్నింటినీ నిత్యం రవాణా చేసే మాఫియా కృష్ణా  జిల్లాతోపాటు సమీప పశ్చిమగోదావరి  జిల్లాలో ఉంది. ఈ వేస్ట్‌ఫుడ్ మాఫియా నెలకు రూ.150 కోట్ల ఆదాయం పొందుతోంది.  అధికారులు దాడులు చేస్తే అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. మనోడే వదిలేయండని సిఫారసు చేయడంతో అధికారులు రెండు, మూడు కేసులకే పరిమితమవుతున్నారు.
 

No comments:

Post a Comment