Wednesday, December 16, 2015

‘అంత్యోదయ’కు మంగళం



చిత్తూరు జిల్లాలోని అంత్యోదయ రేషన్ కార్డులకు ప్రభుత్వం మంగళం పాడనుంది. అత్యంత నిరుపేదలు, వికలాంగులు, ఎలాంటి ఆధారంలేని వృద్ధులు, వితంతువులకు ఆసరాగా అంత్యోదయ కార్డులను మంజూరు చేశారు. ఈ కార్డుంటే సభ్యుల సంఖ్యతో పనిలేకుండా ఒక్కో కుటుంబానికి 35 కేజీల చొప్పున బియ్యాన్ని అందజేసేవారు. అయితే ఈ విధానానికి మంగళం పాడుతూ అంత్యోదయ కార్డులన్నింటినీ అధికారులు తెల్లరేషన్ కార్డుల పరిధిలోని తీసుకొస్తున్నారు. లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు, మహిళలను మోసగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి కత్తెర వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈసారి ఏకంగా అత్యంత పేదలు లబ్ధిదారులుగా ఉండే అంత్యోదయ కార్డులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 9.5 లక్షల కుటుంబాలకు తెలుపు, అంత్యోదయకార్డులు ఉన్నాయి. 89 వేల కుటుంబాలకు అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 35 కేజీల బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల నిరుపేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కొంతమేరకు ఆధారంగా ఉండేది. అయితే ప్రభుత్వం చౌకదుకాణాల్లో బియ్యాన్ని అందించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ద్వారా చౌకదుకాణాల నుంచి ప్రతి నెలా వినియోగదారులు బియ్యాన్ని తెచ్చుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

బయోమెట్రిక్ విధానంలో వినియోగదారుల వేలిముద్రలు సరిపోనట్లు చూపెట్టడం, దీనికితోడు బయోమెట్రిక్ టిన్‌కు నెట్ సమస్యలు చోటుచేసుకున్నాయి. దీని కారణంగా ప్రతినెలా ఇటు వినియోగదారులు, అటు చౌకదుకాణాల డీలర్లు అవస్థలు పడాల్సి వచ్చేది. దీంతో విసుగుచెందిన వినియోగదారులు, డీలర్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కార మార్గంగా  అధికారులు చౌకదుకాణాల్లో అదనంగా ఐరిష్ మిషన్లకు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఐరీష్‌లు కూడా సక్రమంగా పనిచేయక నిరుపయోగంగా మారాయి.

No comments:

Post a Comment