Friday, December 25, 2015

చేనేత ప్రదర్శనలో ఆకలి కేకలు

శ్రీకాకుళంలో చేనేత వస్త్రాల విక్రయానికి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన దుకాణదారులకు ఆకలిదప్పులు తప్పలేదు. రెండు దశాబ్దాలుగా ప్రదర్శన నిర్వహణ వ్యయాన్ని చేనేత జౌళిశాఖ పెంచకపోవడంతో అమ్మకందారులకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటామని వేదికలపై చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

చేనేత వస్త్రాలను నేతకార్మికుల నుంచి సొసైటీల ద్వారా సేకరిస్తారు. వాటిని మార్కెట్‌లో విక్రయించి వచ్చిన లాభాలను జీతాలుగా పంచుకోవడం ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఏడాదికొకసారి ప్రతి జిల్లాలో చేనేత వస్త్రాల విక్రయ ప్రదర్శన తప్పనిసరి. విక్రయ ప్రదర్శనకు చేనేత జౌళిశాఖ జిల్లా శాఖలకు అనుమతిస్తుంది. ఈ అనుమతి మేరకు ప్రదర్శన నిర్వహణకు ఆశాఖ ఉన్నతాధికారులు రూ. 2 లక్షల నిధులు చెల్లిస్తారు.

1994లో నిర్ణయించిన మేరకు ప్రదర్శన పది రోజుల పాటు ఉండాలి. అయితే రెండు దశాబ్దాలు దాటినా నిర్వహణ వ్యయం పెంచకపోవడంతో వచ్చిన అమ్మకందార్లకు భోజనాలు కూడా పెట్టుకోలేని స్థితిలో చేనేత జౌళిశాఖ ఉంది. గతంలో ప్రదర్శనకు 10 రోజులు అవకాశం ఉండేది. నిర్వహణ వ్యయం పెంచని అధికారులు ప్రదర్శనను ఎనిమిది రోజులకు తగ్గించారు. దీంతో అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయని అమ్మకందారులు వాపోతున్నారు.

No comments:

Post a Comment