Sunday, December 20, 2015

విశాఖలో హిల్ కిల్


విశాఖ నగరంలో కొండ లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అనధికార కట్టడాలతో ప్రకృతి ప్రసాదిత గిరులను ఆక్రమించుకుంటున్నందుకు ఫలితంగా ప్రాణాలనే బలికోరుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా శాశ్వత చర్యలు కానరావడం లేదు. నగరంలో 25వేల కుటుంబాలు కొండవాలు ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు అంచనా.

 తుపాను, సునామీ, భూకంపం ఇలా ఏ హెచ్చరికలు జారీ అయినా కొండవాలు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు.  హూద్‌హూద్ తుఫాను  సమయంలో వేలాది ఇళ్లు నేలకూలాయి. అయినా వేరే ఎక్కడా గూడు దొరకకపోవడంతో మళ్లీ అక్కడే గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తామని, రక్షణ గోడలు నిర్మిస్తామని ఎన్నెన్నో హామీలు గుప్పిస్తున్నా అవేవీ అమలులోకి రావడం లేదు.

విశాఖ నగరానికి ఉపాధి, కూలీ పనులు  కోసం చాలా మంది వలస వస్తుంటారు. కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి కనీస వసతులు కూడా ఉండవు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు వంటివి అందుబాటులో లేవు. ఇళ్లకు చేరే దారులు కూడా శిథిలమైపోయి ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ తాగునీటిని సరఫరా చేస్తున్నా, అవి పైపులైన్లు ద్వారా కొండపైకి చేరడం లేదు.
 

No comments:

Post a Comment