Tuesday, December 29, 2015

రాజధాని గ్రామాలు మాయం

రాజధాని కోసం సమీకరించిన భూముల్లో అధికభాగాన్ని రియల్ ఎస్టేట్‌కే వినియోగించనున్నారు. రాజధాని మాస్టర్ ప్రణాళికలో వర్గీకరించిన 20 జోన్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతున్నది. ఏ జోన్‌కు ఎన్ని ఎకరాలో ఈ ప్రణాళికలో స్పష్టం చేశారు. దీని ప్రకారం మధ్యతరహా జనసాంద్రత గలిగిన రెసిడెన్షియల్ జోన్‌కు 12,002.5 ఎకరాలను, సాధారణ వాణిజ్య జోన్‌కు 2856.3 ఎకరాలను కేటాయించారు. ఈ రెండు జోన్‌లలోనే  రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇళ్లు, వాణిజ్య స్థలాలను కేటాయించనున్నట్లు ప్రణాళికలో పేర్కొన్నారు.

అందుకోసం 8వేల ఎకరాలు సరిపోతాయని అంచనా. అంటే మిగిలిన ప్రాంతమంతా రియల్‌ఎస్టేట్ కోసమే వినియోగిస్తారని తెలుస్తోంది. ఈ రెండు జోన్‌లలో... భూములిచ్చిన రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించే చోట దాదాపు 7 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నారు. అక్కడ చిన్న, మధ్యతరగతి, ఎగువ తరగతిని ఆకర్షించే అపార్టుమెంట్లను, ఇళ్లను నిర్మించనున్నారు.


కోర్ రాజధాని వచ్చే మూడు గ్రామాలు మాయం కానున్నాయి. ఉద్ధండరాయుని పాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలు కోర్ రాజధానితో కనుమరుగు కానున్నాయి. ఆ గ్రామాలను పూర్తిగా అక్కడి నుంచి తొలగించనున్నారు. అలాగే రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఆయా గ్రామాల్లో కాకుండా ఆయా గ్రామాల బయట స్థలాలు ఇవ్వాలని మాస్టర్ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఉదాహరణకు తుళ్లూరు గ్రామంలో రైతులకు ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలను ఎక్కడ ఇచ్చేది మాస్టర్ ప్రణాళికలో మ్యాప్ ద్వారా వివరించారు. దాని ప్రకారం అది రాజధాని ప్రాంతానికి దూరంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

No comments:

Post a Comment