Wednesday, December 16, 2015

అనకాపల్తేలిలో తేలని గానుగాట




విశాఖ జిల్లా తుమ్మపాల చక్కెర కర్మాగార క్రషింగ్‌పై ఇప్పటికే  చక్కెర శాఖ ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడంతో డోలాయమానంలో పడిన కర్మాగార ఎండీ వాస్తవాలను బయటకు చెప్పలేక బంతిని ఎమ్మెల్యే కోర్టులోకి నెట్టివేశారు. ప్రస్తుతం తుమ్మపాల చక్కెర కర్మాగార భవితవ్యం అనకాపల్లి ఎమ్మెల్యే పీలాకు చిక్కుముడిని తెచ్చిపెట్టింది. సాంకేతికంగా ఈ సీజన్‌లో క్రషింగ్‌కు అవకాశాలు ఏమాత్రం లేనప్పటికీ గతంలో ఎమ్మెల్యే పీలా ఇచ్చిన హామీ  మేరకు కడదాకా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడం ఎమ్మెల్యేకు ఇబ్బందులను రెట్టింపు చేసింది.

ఈ ప్రతికూల పరిణాల నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోలేక తుమ్మపాల క్రషింగ్ ఎలాగైనా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెబుతూ ఉంటే చక్కెర శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మపాల కర్మాగార యాజమాన్యం సన్నాహాలపై నీళ్లు చల్లారు.  ఇక్కడ నెలకొన్న నైరాశ్యం వీడాలంటే ఆర్థిక చిక్కుముళ్లు తొలగిపోవాలి. ఈ క్రమంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆప్కాబ్ ఏజీఎం సోమవారం సందర్శించి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.

కర్మాగార ఆర్థిక స్థితిగతుల తోపాటు గోదాముల్లో ఉన్న చక్కెర నిల్వలపై తనిఖీలు జరిపారు. మంగళవారం విశాఖలో ఆప్కాబ్ అధికారులు నిర్వహించనున్న సమావేశంలో తుమ్మపాల అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం అప్పులు ఆప్కాబ్‌కు సైతం చికాకు తెప్పిస్తుంటే కొత్తగా ఎలా అప్పులివ్వాలని ఆప్కాబ్ అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా  కేబినెట్ సమావేశంలో సహకార చక్కెర కర్మాగారాలపై చర్చకు వచ్చే అవకాశముంది. అదే సమయంలో తుమ్మపాలపై  పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. క్యాబినెట్ లో తేలకపోతే అసెంబ్లీయే శరణ్యమని తెలుస్తోంది. 

No comments:

Post a Comment