Wednesday, December 16, 2015

సర్కారుపై రేషన్ డీలర్ల సమరం



ప్రజా పంపిణీ వ్యవస్థలో సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం రేషన్ డీలర్ల జీవన భద్రతపై దృష్టిపెట్టటం లేదు. అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ల నోటికి ‘ఈ-పోస్’ పేరిట సాంకేతిక చిక్కంతో చెక్ పెట్టి, వారి  ఆదాయం పెంపుదలపై మాత్రం ప్రకటన చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా చౌకడిపోల నిర్వహణ భారంగా తయారైంది. ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన డీలర్ల సంఘం సమరశంఖం పూరించేందుకు సమాయత్తమైంది. తమ కమీషను పెంపు/ వేతనాల నిర్ణయంపై చేసిన విజ్ఞప్తులకు సానుకూల స్పందన రాకుంటే ఈ నెల 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని నోటీస్ అందజేసింది.

రేషన్ డీలర్లకు చాలీచాలని కమీషన్లు, పారదర్శకత లేని విధానాలే అక్రమాలకు ఆస్కారం కల్పించాయనేది వాస్తవం. అందులో అధికారుల వాటాలు, సరకుల టెండర్లు, ప్యాకింగ్ వ్యవహారాల్లో ఉన్నతాధికారులు తమ వాటాలు పుచ్చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. సబ్సిడీ భారం తగ్గించుకునే ఎత్తుగడల్లో భాగంగా 15 లక్షల బోగస్ రేషన్ కార్డులను ఏరివేసింది. సరకుల పంపిణీకి ఈ-పోస్ యంత్రాలను ప్రవేశపెట్టి గింజగింజకూ లెక్కగడుతోంది.

పెట్టుబడులకు, వస్తున్న కమీషన్‌కు లెక్కచూసుకుంటే చౌక డిపోల నిర్వహణ కష్టసాధ్యమనేది తేలిపోయింది. ప్రతి నెలా రెండు లక్షల టన్నుల బియ్యం, 6,500 టన్నుల చక్కెర, 40 వేల టన్నుల గోధుమలు, 13 వేల టన్నుల కందిపప్పు, 1.5 కోట్ల లీటర్ల కిరోసిన్ చౌకడిపోల్నుంచి సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని 29 వేల రేషన్ డీలర్లు పెట్టుబడుల రూపంలో రూ.191.27 కోట్లు డీడీలు తీస్తుంటే, కమీషన్, మిగిలే ఖాళీ గోతాలతో ఆదాయం రూ.10.71 కోట్లు వస్తోంది. మొత్తం 2.59 లక్షల టన్నుల సరకుల అన్‌లోడింగ్ చార్జీలు రూ.1.55 కోట్లు, 29 వేల చౌకడిపోల అద్దె, కరెంటు చార్జీలకు రూ.5.80 కోట్లు, సహాయకుడి జీతం రూ.7.25 కోట్లు కలిపి లెక్కిస్తే రూ.14.60 కోట్లు ఖర్చవుతోంది. కమీషను,గోతాల ఆదాయం రూ.10.71 పోగా, ఇంకా రూ.3.88 కోట్ల వరకూ నష్టం వస్తున్నట్టు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment