Monday, November 16, 2015

సీఎం హామీలు నీటిమూటలే..!

ఎన్నికల్లో అవి చేస్తాం.. ఇవి చేస్తాం అని హామీ ఇవ్వడం.. గెలిచాక వాటిని మర్చిపోవడం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఈ విద్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగాకులు ఎక్కువే చదివారు. తాను రాయలసీమ బిడ్డనని, ఆ గడ్డకు అన్యాయం చేయనని చెప్పుకునే చంద్రబాబు.. సీమకు ముఖద్వారం లాంటి కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోతోంది. ఇప్పటికి ఏడుసార్లు కర్నూల్లో పర్యటించిన సీఎం.. మొత్తం 51 హామీలు ఇవ్వగా.. కేవలం నాలుగు హామీలు మాత్రమే కార్యరూపం దాల్చడంపై విస్మయం వ్యక్తమౌతోంది.
                     కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని, పరిశ్రమలు పెడతామని, పంచాయతీ రోడ్లు వేయిస్తామని, ఇలా నోటికొచ్చిన హామీలన్నీ బాబు ఇచ్చేశారు. అయితే కనీసం పంచాయతీ రోడ్లకు కూడా దిక్కులేదని కర్నూలు వాసులు లబోదిబోమంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయిన కర్నూలుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇలాగే కొనసాగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తుందని నేతలు మొత్తుకుంటున్నా.. సర్కారులో మాత్రం చలనం రావడం లేదు.
             సీఎం హామీలకు అనుగుణంగా కర్నూలు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపడం, అక్కడ అవి పెండింగ్ పడటం రొటీనైపోయింది. కనీసం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. నిధుల విడుదల చేయకపోవడంతో.. ప్రాజెక్టు పనులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు మాత్రం హామీలు అమలుచేస్తున్నామని ఆత్మవంచన చేసుకుంటున్నారని జనం మండిపడుతున్నారు. 

No comments:

Post a Comment