Tuesday, November 17, 2015

ఆక్వాపార్కుకు పోలీసుల వత్తాసు

పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాపార్కు వద్దని స్థానికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోంది. ఆందోళన చేస్తున్న కే.బేతపూడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అక్రమంగా నిర్భంధంలోకి తీసుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. పోలీసులతో గ్రామస్తులు తగాదాకు దిగడంతో.. ఎస్సై వచ్చి కానిస్టేబుళ్లను తీసుకెళ్లారు.
                 సామాన్యులను కాపాడాల్సిన పోలీసులు ఆక్వాపార్కు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ.. గ్రామంలో భయాందోళనలు కలిగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పకుండా.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇదంతా ఆక్వాపార్కు యాజమాన్యం ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆరోపించారు.
                  మరోవైపు ఆక్వాపార్కు నిర్మాణంపై ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజు వివరణ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి కాలుష్య సమస్య రాదని నమ్మించే ప్రయత్నం చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే సీఎం రాలేదని చెప్పుకొచ్చారు. స్థానికులు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్తున్నారని, టీడీపీ సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్లు వస్తున్నాయి. 

No comments:

Post a Comment